‘ప్రేమకథల్లో నన్ను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదేమో, వాళ్లు నా నుంచి ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలు కోరుకుంటున్నారు’ అన్నారు ప్రభాస్. ‘రాధే శ్యామ్’ ఆశించిన విజయం సాధించకపోవడానికి ఇదొక కారణంగా ఆయన భావిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమాలో నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఫలితంపై తాజాగా ప్రభాస్ స్పందించారు.
ఓ వెబ్ పోర్టల్తో ఆయన మాట్లాడుతూ…‘నన్నింకా ప్రేక్షకులు బాహుబలి లాగే చూస్తున్నారు. అలాంటి భారీ సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అవే అయితే నటుడిగా నేను కొత్తదనం చూడలేను. విభిన్నమైన సినిమాల్లో నటించాలని నా కోరిక. అవి చిన్న చిత్రాలైనా పర్లేదు. ‘రాధేశ్యామ్’ రిలీజ్ టైమ్కు కోవిడ్ ఇంకా పూర్తిగా పోలేదు. ఇది సినిమాపై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. నన్ను ప్రేమ కథల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు లేదా స్రిప్టులో ఏదైనా లోపం ఉండి ఉండొచ్చు’ అని అన్నారు. గతంతో చూస్తే ప్రభాస్ సినిమాల ఎంపికలో వేగం పెంచారు. ఆయన ప్రస్తుతం దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో ‘ఆది పురుష్’, ‘సలార్’, ‘స్పిరిట్’, ‘ప్రాజెక్ట్ కె’, మారుతి దర్శకత్వంలో సినిమా ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యమైన ఈ చిత్రాలన్నీ ఏడాదికొకటి చొప్పున తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.