ముంబై: తాను రాజకీయాల్లో (Politics) చేరడం లేదని, చరమాంకం వరకు నటుడిగానే (Actor) కొనసాగుతానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. 200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశారు. ఆ ప్రశ్నే తలెత్తదని వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్లో బీహార్ (Bihar) మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad), ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను (Tejashwi Yadav) మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. అయితే అప్పటి నుంచి తాను రాజకీయాల్లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నదని వెల్లడించారు.
తాజాగా ఆయన నటించిన ‘సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై’ (Sirf ek bandaa kaafi hai)సినిమా విడులైంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన తన సొంతరాష్ట్రమైన బీహార్లోని పాట్నాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులు రాజకీయాల్లోకి వస్తున్నారా అని ప్రశ్నించడంతో ఆయన పై విధంగా స్పందించారు. తాను నటుడినని, నటుడిగానే కొనసాగుతానని చెప్పారు. ఇక అసలు రాజకీయాల్లో చేరుతున్నారా అనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందని ప్రశ్నించారు.