హైదరాబాద్ : సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతి చెందాడు. గత కొద్ది రోజుల క్రితం కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందారు. ఈ మేరకు మహేశ్ మృతిని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని చెన్నై – కలకత్తా రహదారిపై జూన్ 26న తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మహేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్కు తరలించారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.
కత్తి మహేశ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందజేశారు. కత్తి మహేశ్ చికిత్స కోసం రూ.17 లక్షలు విడుదల చేసినట్లు సీఎం క్యాంప్ ఆఫీసు ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ ఆర్థికసాయం అందజేశారు.