Kantha Rao | నాటి తరం ప్రఖ్యాత నటుడు కాంతారావు శత జయంతోత్సవం రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన కాంతారావు.. 400లకు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరై కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ… కాంతారావు 400కు పైగా సినిమాల్లో, జానపద చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ఆ చిత్రాలకు ఓ ప్రత్యేకతను చేకూర్చి కత్తి కాంతారావుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కాంతారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఏడాది పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ… కాంతారావు సినిమాల్లో చేసిన కత్తి యుద్ధాలతో కత్తి కాంతారావుగా పేరొందాడని తెలిపారు. ఆయన చేసిన కత్తి యుద్ధాలను చూసి చిన్నప్పుడు తాము కూడా కర్రలతో అలానే చేసేవాళ్ళమని గుర్తు చేసుకున్నారు. కాంతారావు గురించి రాబోయే తరాలకు తెలియజేసేవిధంగా మరిన్ని కార్యక్రమాలు జరపడానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు.
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… జానపద సినిమాలతో కత్తి కాంతరావుగా పేరుపొందిన కాంతారావు 400 పైగా చిత్రాలలో నటించాడని, ఎన్టీఆర్, అక్కినేనిలకు సమకాలికులుగా సమానమైన గుర్తింపు పొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ఆదేశాలమేరకు ప్రభుత్వం తరపున కాంతారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడమేకాకుండా, ప్రతినెలా కాంతారావు కుటుంబానికి జీవనభృతిని అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంతారావు కుమారుడు రాజా, ఎన్నారై టిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్, వల్లాల శ్రీనివాస్, మల్లేష్, తిరుమందాస్ నరేష్, నూనెముంతల రాజు తదితరులు పాల్గొన్నారు.