‘హీరో, విలన్ అనే భేదాలు నాకు లేవు. నిడివితో సంబంధం లేకుండా నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తా’ అని అన్నారు గోవింద్ పద్మసూర్య. ‘అలా వైకుంఠపురములో’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. తన సినీ ప్రయాణాన్ని గురించి గోవింద్ పద్మసూర్య మాట్లాడుతూ “అడయాలంగల్’ సినిమాతో 2008లో నా కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్గోపితో పాటు పలువురు అగ్రహీరోల సినిమాల్లో కీలక పాత్రలుచేశా. తమిళ చిత్రం ‘కీ’లో ప్రతినాయకుడిగా నటించా. అందులో నా నటన నచ్చి ‘అలా వైకుంఠపురములో’ త్రివిక్రమ్ అవకాశమిచ్చారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’లో నెగెటివ్ షేడ్స్తో కూడిన పాత్రను చేశా. ఆది అనే యువకుడిగా నా పాత్రకు చక్కటి స్పందన లభిస్తున్నది. ఆది పేరుతోనే ప్రతి ఒక్కరూ నన్ను పిలుస్తున్నారు. శక్తివంతమైన నటనను కనబరిచానని రావురమేష్ ప్రశంసించడం మర్చిపోలేను. పాత్రల పరంగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాను. నటుడిగా ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటా. తెలుగులో నాని నిర్మాణంలో రూపొందుతున్న ‘మీట్ క్యూట్’తో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నా’ అన్నారు.