Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశం ముగిసిన అనంతరం సినీ హీరో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే విధంగా సీఎం జగన్ మాట్లాడారని చిరంజీవి తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్దగా కాదు.. ఒక బిడ్డగా చెప్తున్నాను.. అందరూ సంయమనం పాటించాలి.. ఎవరూ పడితే వారు మాట్లాడి నోరు జారొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయని చిరంజీవి స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై గంటన్నర పాటు చర్చించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలపై జగన్తో చిరంజీవి చర్చించి, పరిష్కరించాలని కోరారు.
హైదరాబాద్కు తిరుగు ప్రయాణం సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో మీడియాతో చిరంజీవి మాట్లాడారు. సీఎం జగన్తో జరిగిన సమావేశం చాల సంతృప్తికరంగా సాగింది. ఆనందంగాఉంది. ఈ పండుగ పూట ఆయన ఆహ్వానించారు. ఆత్మీయత కనబరిచిన విధానం అత్యంత సంతృప్తినిచ్చింది. ఆప్యాయత కనబరిచిన జగన్ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చిరు పేర్కొన్నారు.
గత కొద్ది నెలలుగా సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఏం జరుగుతుంది అనే అసంతృప్తి ఉంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి నన్ను జగన్ ఆహ్వానించారు. తాను చేసిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని, విధివిధానాలను చర్చించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో వినోదం అనేది అందుబాటులో ఉండాలన్న ప్రయత్నాన్ని గౌరవిస్తున్నాను. సినీ పరిశ్రమలో ఉన్న సాదకబాధకాలను కూడా జగన్కు వివరించాను. సినీ పరిశ్రమ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారు. కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారిస్తామని జగన్ చెప్పారు.
సినిమా వెనుకాల ఎంతో మంది కార్మికులు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులకు కష్టాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా సినీ కార్మికులకు అండగా నిలిచాం. కార్మికుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. థియేటర్స్ వాళ్లకు కూడా బాధలు ఉన్నాయి. థియేటర్లు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందన్న అభద్రతాభావంలో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరికి ఒక ధైర్యం కల్పించేందుకు, నిర్మాణాత్మకమైన సూచనలు చెప్పడం జరిగింది. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అన్ని విషయాలను అవగాహన చేసుకున్నారు. తాను ఒక పక్షానే ఉండను. అందరినీ సమదృష్టితో చూస్తాను. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. జగన్ మాటలు విన్నాక ఎనలేని ధైర్యం వచ్చింది. త్వరలోనే తనతో సమావేశమై అన్ని నిర్ణయాలను ప్రకటిస్తామని, అనంతరం జీవో విడుదల చేస్తామని జగన్ చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు.
పెద్దగా కాదు.. ఒక బిడ్డగా సినీ ఇండస్ట్రీకి, థియేటర్స్ వారికి ఒక వ్యక్తిగా తెలియజేస్తున్నాను.. మీరు ఎవరూ కూడా అనవసరంగా ఆందోళన చెందొద్దు. ఎవరూ పడితే వారు మాట్లాడి నోరు జారొద్దు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయన్నారు. సంయమనం పాటించండి. వారం పదిరోజుల్లో సినీ పరిశ్రమకు అనుకూలమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఐదో షో నిర్వహణపై కూడా జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశం ఎంతో ఫలవంతంగా జరిగిందన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి, అందరి సూచనలు, సలహాలను జగన్ దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి తెలిపారు.