కథాంశాల ఎంపికలో కొత్తదనానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటారు విలక్షణ కథానాయకుడు ధనుష్. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక పంథా సృష్టించుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ హిందీ షోలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. జీవితకథా చిత్రాల్లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పారు. ముఖ్యంగా రజనీకాంత్, ఇళయరాజా అంటే ఎనలేని అభిమా నమని..అవకాశమొస్తే వారి బయోపిక్స్లో నటిస్తానని చెప్పారు. తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ధనుష్ టాలీవుడ్లో స్ట్రెయిట్ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ఇటీవలే ఓ సినిమాకు అంగీకరించారు.