సుధీర్బాబు ఎంచుకునే కథాంశాల్లో తప్పకుండా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన అదే పంథాను ఫాలో అవుతున్నారు. సుధీర్బాబు కథానాయకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మాతలు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం సుధీర్బాబు పాత్రికేయులతో పంచుకున్న సంగతులు..
‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి మోహకృష్ణతో నాకిది రెండో సినిమా. ‘మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం. కానీ సినిమానే మనల్ని తీస్తుంది’ అని ఈ మూవీలో ఓ డైలాగ్ ఉంది. మా కాంబినేషన్ కోసమే ఈ సినిమా చేయలేదు. కథనే మా ఇద్దరిని ఎంపిక చేసుకుందని అనుకుంటున్నా. ఓ డాక్టర్, సినీ దర్శకుడు మధ్య జరిగే ప్రేమకథ ఇది. వారి ఆశయాలు, ఆకాంక్షలు..కుటుంబాల మధ్య సంఘర్షణ ప్రధానంగా కథ నడుస్తుంది. లవ్స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కదిలిస్తాయి. ‘సమ్మోహనం’ కూడా సినిమా నేపథ్య కథనే అయినా..రెండింటికి ఎలాంటి పోలిక ఉండదు.
కొంచెం తిక్కున్న క్యారెక్టర్..
ఇంద్రగంటి సినిమా అంటేనే ఓ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. ఇదీ అలాంటి కథనే. ఈ సినిమాలో నేను కమర్షియల్ సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తా. నాకు కొంచెం తిక్కెక్కువ. ఇతరుల కంటే భిన్నంగా కనిపించాలనే తపనతో జీవిస్తుంటా. కమర్షియల్ సినిమాలో కూడా సమాజానికి ఉపయోగపడే అంశాలుండాలనేది నా సిద్ధాంతం. నా పాత్రను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా కొత్తగా డిజైన్ చేశారు. కథానుగుణంగా వివేక్సాగర్ అద్భుతమైన సంగీతాన్నందించారు.
దర్శకత్వం గురించి ఆలోచిస్తా..
నేను చాలా మంది కొత్త దర్శకులతో పనిచేశా. వారిని దగ్గరి నుంచి పరిశీలించడంతో దర్శకత్వంపై ఆసక్తి ఏర్పడింది. భవిష్యత్తులో దర్శకత్వం చేసే విషయం గురించి ఆలోచిస్తా. నటుడిగా నా ప్రయాణం సంతృప్తికరంగా సాగుతున్నది. బాలీవుడ్ నుంచి ‘బ్రహ్మాస్త’ ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో ‘సమ్మోహనం’తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ప్రస్తుతం హంట్, మామామశ్చీంద్ర, యూవీ క్రియేషన్స్ సినిమాలు చేస్తున్నా. అలాగే ‘సెహరి’ దర్శకుడు జ్ఞానసాగర్తో ఓ సినిమా చేయబోతున్నా.