‘28 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లో ఉండాల్సిన కండీషన్ హీరోయిన్కి ఏర్పడుతుంది. ఆ టెంపరేచర్ దాటితే ఆమెకు ప్రాణాపాయం. అలాంటి పరిస్థితిని ఆ జంట ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం’ అని నిర్మాత సాయిఅభిషేక్ అన్నారు. నవీన్చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా ఆయన నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ లవ్స్టోరీ ‘28 డిగ్రీస్ సెల్సియస్’. ‘మా ఊరి పొలిమేర’ఫేం డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఈ నెల 4న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత సాయి అభిషేక్ మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ‘2017లో సినిమా స్టార్ట్ చేశాం. 2019లో పూర్తయ్యింది. 2020 మేలో విడుదల చేయాలనుకున్నాం. కోవిడ్ వల్ల థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఓటీటీ ఆఫర్లొచ్చాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేశాం. ఇన్నాళ్లకు కుదిరింది. వైజాగ్లో షూటింగ్ స్టార్ట్ చేసి, గోవా, జార్జియాల్లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. కంటెంట్పై ఉన్న నమ్మకంతో క్వాలిటీ విషయంలో రాజీపడలేదు’ అని తెలిపారు.