ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఉపాధ్యక్షుడు ఎ. గురురాజ్తో కలిసి ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే గౌడ్ మాట్లాడుతూ…‘సినిమా చిత్రీకరణలు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.
ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీని వల్ల ఎంతోమంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోతారు. పది మంది పెద్ద నిర్మాతలు ఏడాదికి నిర్మించే చిత్రాల కన్నా చిన్న నిర్మాతలు చేసే సినిమాలు మూడింతలు ఉంటాయి. ఎవరినీ సంప్రదించకుండా బంద్ నిర్ణయం ఎలా చేస్తారు? షూటింగ్స్ ఆపితే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న చిన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీరే టికెట్స్ పెంచేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు.
పెరిగిన ధరలతో ఇవాళ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. ఓటీటీకి పదివారాల గడువు పెట్టడంపైనా మరోసారి చర్చ జరగాలి. చిన్న సినిమాలకు థియేటర్లూ దొరక్క, ఓటీటీకి అమ్ముకోకపోతే నిర్మాతలు నష్టపోతారు’ అన్నారు.