‘నాకు చాలా కాలంగా మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది. ‘లైగర్’ వంటి పాన్ ఇండియా సినిమాలో విలన్ పాత్రను పోషించడం గొప్ప సంతోషాన్నిచ్చింది’ అని అన్నారు విష్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘లైగర్’ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సందర్భంగా విష్ మాట్లాడుతూ ‘మా స్వగ్రాహం చేవెళ్ల దగ్గర కడుమూరు.
కాలేజీ రోజుల నుంచి పూరి సినిమాలకు పెద్ద అభిమానిని. నా మార్షల్ ఆర్ట్స్ వీడియోలు చూసి ఆయన పిలిపించారు. 2015లో పూరిగారిని కలిశాను. మెహబూబా, ఇస్మార్ట్శంకర్, రొమాంటిక్ సినిమాల్లో నటించా. ‘లైగర్’ సినిమాతో నా కల నిజమైంది. ఈ సినిమాలో నేను అహంకారి అయిన ఫైటర్ రోల్ను పోషిస్తున్నా. హీరో విజయ్కు, నాకు శత్రుత్వం ఏమిటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
‘లైగర్’ స్పోర్ట్స్ డ్రామా కాదు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. ఎంఎంఏ అనే నేపథ్యంలో కథ నడుస్తుంది. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. దర్శకుడి ఆలోచనల ప్రకారం నా పాత్రకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తా. నటనతో పాటు పూరి కనెక్ట్స్ సంస్థకు సీఈఓగా కూడా పనిచేస్తున్నా. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటించాలని ఉంది’ అన్నారు.