ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం కమిటీ కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా నిబంధనలు నటీనటులకు మేలు చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు నటీనటులందరూ కేవలం ఒక విభాగంలో ఒక చిత్రానికి మాత్రమే నామినేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో భిన్న చిత్రాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచినప్పటికీ కేవలం ఒకే ఒక్క నామినేషన్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇక నుంచి ఈ నిబంధనను సడలించనున్నారు. నటీనటులు వివిధ చిత్రాలకు నామినేట్ చేసుకునే వీలు కల్పిస్తున్నారు. దీంతో వారికి ఆస్కార్ గెలుపు అవకాశాలు కూడా మెరుగవుతాయి. అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో కూడా ఆస్కార్ కమిటీ కీలక మార్పులు చేసింది. విదేశీ చిత్రాల కేటగిరిలో గతంలో ప్రతి దేశం ఒకే చిత్రాన్ని నామినేట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ చిత్రాల్ని పరిశీలనకు పంపవచ్చు. దీనితో పాటు కేన్స్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలు నేరుగా ఆస్కార్ బరిలో పోటీపడే అవకాశాన్ని కల్పిస్తూ నిబంధనలను సవరించారు.
ఏఐ (కృత్రిమ మేధ) కంటెంట్ విషయంలో కూడా ఆస్కార్ అకాడమీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏఐ సహాయంతో తయారు చేసిన స్క్రిప్ట్లు, రూపొందించిన రచనలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. అలాగే ఏఐతో సృష్టించిన సన్నివేశాలను కూడా ఆమోదించమని తెలియజేసింది. వచ్చే ఏడాది మార్చిలో ఆస్కార్ 99వ పురస్కారాల ప్రదానం జరుగనుంది.