Zomato | ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు భారీగా తమ ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలో.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఊరటనిచ్చే వార్త చెప్పింది. కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకులు దీపేందర్ గోయల్ లింక్డిన్ ద్వారా తెలియజేశారు. వివిధ విభాగాల్లో సుమారు 800 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు సీఈవో, జనరలిస్ట్, గ్రోత్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ వంటి ఉద్యోగాలకు కొత్త వారిని తీసుకోనున్నట్లు గోయల్ తెలిపారు. ఈ ఐదు విభాగాల్లో 800 ఖాళీలున్నట్లు చెప్పారు.
కాగా, గతేడాది నవంబర్లో జొమాటో దేశవ్యాప్తంగా తమ సంస్థలో 3 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. ఏటా చేపట్టే పనితీరు ఆధారిత మదింపు ప్రక్రియలో భాగంగానే మూడు శాతం మంది ఉద్యోగులను తొలగించామని, అంతకు మించి ఏమీ లేదని కంపెనీ గతంలో ప్రకటించింది. మరోవైపు లాక్డౌన్ సమయంలో నష్టాలు రావడంతో కంపెనీ 2020 మే నెలలో దాదాపు 13 శాతం మందిని ఇంటికి పంపించేసింది. తాజాగా ఉద్యోగ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.