న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఉదారత చాటారు. ఆ సంస్థ డెలివరీ ఏజెంట్ల పిల్లల చదువు కోసం సుమారు రూ.700 కోట్ల (90 మిలియన్ డాలర్ల) విరాళం ప్రకటించారు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్కు ఈ మేరకు ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్రణాళిక(ఈఎస్వోపీ)లను కేటాయించారు. అంతర్గత సమాచారం ద్వారా ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలిపారు. జోమాటో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేశారు. ఇన్వెస్టర్లు, బోర్డు
గత పనితీరు ఆధారంగా పెట్టుబడిదారులు, బోర్డు ద్వారా ఆయనకు కొన్ని ఈఎస్వోపీలు మంజూరయ్యాయి. చట్టం ప్రకారం కనీసం ఒక సంవత్సరం వెస్టింగ్ అవసరం ఉన్నందున గత నెలలో కూడా కొన్ని ఈఎస్వోపీలు పొందారు.
ఈ నేపథ్యంలో వీటిని జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జడ్ఎఫ్ఎఫ్)కు విరాళంగా ఇస్తున్నట్లు దీపిందర్ గోయల్ తెలిపారు. గత నెలలో సగటు షేర్ ధర ప్రకారం ఈ ఈఎస్వోపీల విలువ సుమారు 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ.693 కోట్లు) అని అంతర్గత ఉత్తర్వులో ఆయన పేర్కొన్నారు. జొమాటో డెలివరీ భాగస్వాముల పిల్లల విద్య కోసం ఈ నిధులను జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జడ్ఎఫ్ఎఫ్) వినియోగిస్తుందని తెలిపారు. ఏడాదికి ఒక్కో పిల్లాడికి రూ.50,000 చొప్పున ఇద్దరు పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అయితే జొమాటో డెలివరీ భాగస్వామిగా ఐదేండ్లకుపైగా ఉన్న వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించారు. సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న డెలివరీ భాగస్వాముల ఒక పిల్లవాడి చదువుకు ఏడాదికి లక్ష వరకు సహాయాన్ని పెంచుతామన్నారు.
కాగా, మహిళా డెలివరీ భాగస్వాములు ఐదేళ్లు, పదేళ్లు సర్వీస్లో కొనసాగడం చాలా తక్కువగా ఉంటుందని దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పారు. 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమ్మాయిల కోసం ‘ప్రైజ్ మనీ’ ప్రవేశపెడతామని వెల్లడించారు. విద్యలో ఉన్నతంగా రాణించి ప్రతిభ చాటిన పిల్లలకు ఉన్నత విద్య కోసం పరిమితులకు మించి స్కాలర్షిప్లు అందజేస్తామని వివరించారు. అలాగే దురదృష్టవశాత్తు డెలివరీ భాగస్వామి ఉద్యోగంలో ఉండగా మరణించిన సందర్భంలో సర్వీస్తో సంబంధం లేకుండా ఆ కుటుంబ పోషణ, పిల్లల విద్యకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అయితే దీని కోసం ఈఎస్వోపీ షేర్లన్నింటినీ తక్షణమే లిక్విడేట్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇదంతా జరుగుతుందన్నారు. తొలి ఏడాది పది శాతం కన్నా తక్కువగా ఈ షేర్లను లిక్విడేట్ చేస్తామని చెప్పారు. జొమాటో ఉద్యోగుల నుంచి కూడా తమ ఫౌండేషన్ విరాళాలను సేకరిస్తుందని వెల్లడించారు. దీని కోసం జడ్ఎఫ్ఎఫ్లో స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేస్తామని వివరించారు. డెలివరీ భాగస్వాముల పిల్లలు మెరుగైన జీవితాన్ని నిర్మించుకునే అవకాశం విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ పిల్లల్లో కొందరు జొమాటోలోని వేర్వేరు వ్యాపార సంస్థలను లీడ్ చేయడం ద్వారా, మరి కొందరు సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసి దేశ భవిష్యత్తును మార్చగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.