న్యూఢిల్లీ, మే 24: విలీన ఒప్పందాన్ని రద్దు చేసినందుకుగాను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ) నుంచి 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.748.7 కోట్లు) టర్మినేషన్ ఫీజును జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్ఈఈఎల్) కోరుతున్నది. 2021 డిసెంబర్ 22న జీ, సోనీ విలీనానికి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
2023 ఆగస్టు 10న ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం సోనీ గ్రూప్ సంస్థలైన కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, బంగ్లా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లతో జెడ్ఈఈఎల్ విలీన స్కీంకు ఆమోదం కూడా తెలిపింది. ఇది 10 బిలియన్ డాలర్ల విలువైన మీడియా సంస్థ ఏర్పాటుకు దారితీసింది. అయితే రెండేండ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 22న విలీన ఒప్పందాన్ని సోనీ కార్పొరేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జెడ్ఈఈఎల్ విలీన షరతులను పాటించడం లేదని కూడా పేర్కొన్నది.