హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ జాజిల్ ప్రీపెయిడ్ ఒషియన్ సర్వీసెస్..ఈ నెల 14 నుంచి ఐపీవోకి రాబోతున్నది. రూ.564 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి షేరు ధరల శ్రేణిని రూ.156-164గా నిర్ణయించింది. దీంట్లో రూ.392 కోట్లను తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సేకరించనుండగా, మిగతా రూ.174 కోట్లను ప్రమోటర్లు, ఇతర పెట్టుబడిదారులకు సంబంధించిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో విక్రయించనున్నారు.
ఈ వాటాల విక్రయ అనంతం సంస్థలో ప్రమోటర్ల వాటా 42 శాతానికి తగ్గనున్నది. కంపెనీ ఫౌండర్, చైర్మన్ రాజ్ పీ నారాయణమ్ 0.02 శాతం విలువైన షేర్లు విక్రయిస్తుండగా, మరో ప్రమోటర్ అవినాశ్ రమేశ్ ఇంతే స్థాయిలో వాటాను విక్రయిస్తున్నారు. మరో ఇన్వెస్టర్ వెంచర్ఈస్ట్ ప్రోయాక్టివ్ ఫండ్ 2.17 శాతం, జీకేఎఫ్ఎఫ్ వెంచర్ 0.02 శాతం, వెంచర్ఈస్ట్ సెడ్కో ప్రొయాక్టివ్ ఫండ్ 1.72 శాతం, వెంచర్ఈస్ట్ ట్రస్టీ కంపెనీ 3.78 శాతం, కోటేశ్వర రావు 0.02 శాతం వాటాలను ఓఎఫ్ఎస్ రూట్లో విక్రయించనున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.370 కోట్ల ఆదాయంపై రూ.40 కోట్ల నికర లాభాన్ని గడించింది.