బేగంపేట్ జనవరి 30: ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్లో క్వీన్స్ ప్లాజాలో కోడ్ ఆక్యూటీ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కృత్రిమ మేధస్సు, స్టాఫింగ్, మేనేజ్డ్ సర్వీస్ సేవలు అందిస్తున్న ఈ సంస్థ భారత్తోపాటు అమెరికాలోనూ సేవలు అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ముఖ్యంగా యువత ఇలాంటి చిన్న స్థాయి సంస్థలను ప్రారంభించి రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యులు కావలని మంత్రి సూచించారు.
ఈ రంగంలో ముందుకువెళ్లే యువతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ..ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు మంత్రి కేటీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఐటీ డైరెక్టర్ కొంతం దిలీప్, కోడ్ ఆక్యూటీ సీఈవో అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.