KYC For Demat A/C| స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ల కోసం మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందా.. అయితే, నో యువర్ కస్టమర్ (కేవైసీ) ఫామ్లో మీ ఆదాయ వనరుల వివరాలను అంద చేయాల్సిందే. ఈ నెల 31 లోగా (శనివారం) లోగా కేవైసీ పత్రాలను సమర్పించకుంటే సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో మీ డీమ్యాట్ ఖాతాను క్లోజ్ చేస్తారు. గడువు దగ్గర పడటంతో పలు స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థలు తమ ఖాతాదారులకు ఈ-మెయిల్స్ పంపాయి. ఆదాయం వనరులతోపాటు కేవైసీ డిటైల్స్ వెల్లడించకుంటే డీమ్యాట్ ఖాతాలను బ్యాంకులు క్లోజ్ చేస్తాయని తెలిపాయి.
దీంతోపాటు డీమ్యాట్ ఖాతాదారుల నామినేషన్ నిబంధనలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) మార్చేసింది. మార్చిన నిబంధనలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం ఖాతాదారులు తమ నామినేషన్ అండ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసి సమర్పించాలి. ఒకవేళ సంతకం చేయలేని పక్షంలో వేలి ముద్ర వేయాలి. దానికి సాక్షితో సంతకం చేయించాలి.
నూతనంగా తెరిచే ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలకు కూడా నామినేషన్ ఆప్షన్ వర్తిస్తుందని సెబీ తెలిపింది. ఇది కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఒకవేళ సదరు ఇన్వెస్టర్.. తన డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతా తెరవడానికి నామినేషన్ చేసేందుకు సిద్ధంగా లేకపోతే ఆ వివరాలను సెబీకి తెలియచేయాల్సి ఉంటుంది.
మీరు ఇప్పటికే డీమ్యాట్ ఖాతా కలిగి ఉంటే డిక్లరేషన్ ఫామ్ నింపాల్సిందే. 2022 మార్చి నెలాఖరులోగా నామినేషన్ ఫామ్ నింపాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నామినేషన్ ఫామ్ నింపడానికి సిద్ధంగా లేకపోతే దానికి మరో ప్రత్యామ్నాయ ఫామ్ పూరించాలి. నామినేషన్ లేదా డిక్లరేషన్ ఫామ్ సమర్పించకపోతే సదరు ఖాతా స్తంభింపజేస్తారు.
సెబీ నూత నిబంధనల ప్రకారం డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతాదారులు నామినీలకు సంబంధించి నిర్ధిష్ఠ సమాచారం ఇవ్వాలి. ఒకవేళ సదరు ఖాతాదారు మరణిస్తే.. నామినీకి ఎన్ని షేర్లు కేటాయించారో తెలియజేయాలి. నామినేషన్ పేరు మార్చాలనుకున్నా.. ముందుగా చేర్చిన నామినీకి ఎన్ని షేర్లు కేటాయించాలో నిర్దేశించుకోవాలి. గరిష్ఠంగా ముగ్గురిని మించి నామినేట్ చేయకూడదు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా నిర్ణయిస్తే వారి వాటా వివరాలనూ నిర్ణయించాల్సిందే.