Jeweller Loss | మీ సేవింగ్స్ ఖాతాలోకి మనీ క్రెడిట్ అయినట్లు మీ బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందా.. అయితే సేవింగ్స్ అకౌంట్ గల బ్యాంక్ యాప్ గానీ, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం తెలివైన పని అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కొద్దీ.. సెక్యూరిటీ ఫీచర్లు తీసుకొస్తున్నా.. పలువురు వ్యక్తులు సైబర్ మోసగాళ్ల ట్రిక్కుల ‘వల’లో చిక్కుకుంటున్నారు. అందులో జ్యువెల్లరీ వ్యాపారులు కూడా ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి కూడా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు.
ఢిల్లీలో అతి పెద్ద బులియన్ మార్కెట్ కేంద్రంగా ఉన్న చాందినీ చౌక్ కుచ్చా మహాజనీ ప్రాంతంలో ఐదు దశాబ్దాలకు పైగా జ్యువెల్లరీ దుకాణం నడుపుతున్నారు నావల్ కిశోర్ ఖండేల్వాల్. సదరు జ్యువెల్లరీ వ్యాపారికి ఖాతాలోకి ఒక వ్యక్తి (స్కామ్స్టర్) రూ.3 లక్షలు క్రెడిట్ చేశాడు. ఆ మనీ తన ఖాతాలో క్రెడిట్ అయినట్లు మెసేజ్ రాగానే సదరు వ్యాపారి.. సంబంధిత వ్యక్తికి బంగారం గొలుసులు పంపాడు. అయోధ్యకు చెందిన ఒక వ్యక్తి ఫోన్ ద్వారా 15 గ్రాముల బంగారం గొలుసు కావాలని నావల్ కిశోర్ ఖండేల్వాల్ ను కోరాడు. తదనుగుణంగా బంగారం గొలుసు అందజేయడానికి ఖండేల్వాల్.. అయోధ్యకు వెళ్లాడు.
ఆ వ్యక్తి ఢిల్లీలోని ఖండేల్వాల్ దుకాణానికి రాలేదు.. ఆన్లైన్లో మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి అని చెప్పి ఫోన్ లోనే ఖండేల్వాల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిటైల్స్ అడిగాడు. కొంత సేపటి తర్వాత జ్యువెల్లర్ బ్యాంకు ఖాతాలో రూ.93,400 మనీ క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్.. తన పిల్లలకు పంపాడు ఖండేల్వాల్.. అటుపై సదరు వ్యక్తి ఇచ్చిన చిరునామాకు గోల్డ్ చైన్ పంపించాడు. మరుసటి రోజు మళ్లీ 30 గ్రాముల బంగారం గొలుసు కావాలని చెప్పాడు ఆ సైబర్ మోసగాడు.. అందుకనుగుణంగా ఖండేల్వాల్ ఖాతాలో రూ.1,95,400 డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కొనసాగింపుగా మళ్లీ బంగారం గొలుసు పంపాడు.
ఆ తర్వాత తన బ్యాంక్ యాప్లో ఖాతా డిటైల్స్ చెక్ చేసుకుంటే గానీ నావల్ కిశోర్ ఖండేల్వాల్కు అసలు సంగతి బోధ పడలేదు. తన బ్యాంకు ఖాతాలో మనీ డిపాజిట్ కాలేదని రియలైజ్ అయ్యాడు. రెండు మెసేజ్లు, బ్యాంకు ఫార్మాట్లో వచ్చే సమాచారం చెక్ చేసుకున్న తర్వాత తమ ఖాతాలో మనీ డిపాజిట్ కాలేదని తెలుసుకున్నాడు.
‘నేను ఒక అధ్యాత్మిక కార్యక్రమంలో బిజీగా ఉన్నా. మోసానికి గురవుతానని అప్పుడు గుర్తించలేదు. నా కొడుకులను బ్యాంకుకెళ్లి ఖాతా చెక్ చేయాల్సిందిగా కోరాను. వారు బ్యాంకులో మనీ డిపాజిట్ కాలేదని ధ్రువీకరించారు. దీనికి తమకు ఎటువంటి సంబంధం లేదని బ్యాంకు అధికారులు చెప్పారు’ అని ఖండేల్వాల్ తెలిపారు. ఆయన కొడుకు మయాంక్ మాట్లాడుతూ తమ తండ్రి ఫోన్లో మాత్రమే బ్యాంకు యాప్ ఉండటంతో అప్పటికప్పుడు చెక్ చేయలేదని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మోసగాళ్ల ఆచూకీ కనిపెట్టలేకపోయారు. పలువురు ఆభరణాల వ్యాపారులు సైతం ఇటువంటి మోసగాళ్ల బారీన పడ్డట్లు గుర్తించారు.
బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగేశ్ సింఘాల్ స్పందిస్తూ.. ‘ఆదివారం ఖండేల్వాల్ మోసపోయిన సంగతి తెలుసుకున్నా.. దేశవ్యాప్తంగా జ్యువెల్లరీ వ్యాపారులందరికీ ఈ మెసేజ్ పంపా. పలువురు వ్యాపారులు నాకు ఫోన్ చేసి.. తమకూ ఇలాగే జరిగిందని చెప్పారు’ అని తెలిపారు.
ఈ విషయమై కేంద్ర హోంశాఖ సైబర్ క్రైమ్ పోర్టల్లోనూ ఫిర్యాదు చేశారు. కానీ, నిపుణులు మాత్రం ఈ తరహా మోసాలు సైబర్ ఫ్రాడ్ కిందకు రావని చెబుతున్నారు. ఇటువంటి ఘటనలు చీటింగ్, పొర్జరీ కిందకు వస్తాయని తెలిపారు.ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కిందకి వస్తాయని అంటున్నారు.