Direct 2 Mobile BroadCast | గతంలో కేబుల్ కనెక్షన్ ఉంటే టీవీలో వార్తలు, వినోద కార్యక్రమాల చానెళ్ల ప్రసారాలు వీక్షించాం.. తర్వాతర్వాత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కొద్దీ.. డైరెక్ట్ టూ హోం (డీటీహెచ్) టెక్నాలజీతో ఇంట్లో హోం థియేటర్లే వెలిశాయి.. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండానే అన్ని టీవీ చానళ్ల ప్రసారాలు వీక్షించే అవకాశం రాబోతున్నది.. చాలా తక్కువ ఖర్చుతో, ఎటువంటి డేటా కాస్ట్ లేకుండానే ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రీగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వీక్షించి మానసిక ఉల్లాసం పొందొచ్చు. అందుకు డైరెక్ట్ 2 హోం తరహాలోనే డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ వస్తోంది.
డైరెక్ట్ 2 హోం తరహాలో డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ వినియోగంలోకి తేవడానికి ఐఐటీ-కాన్పూర్, కేంద్ర సమాచార ప్రసారాలశాఖ, కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖలు కసరత్తు ప్రారంభించాయి. ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే అవకాశాలపై టెలికం ఆపరేటర్లతో ఈ టీం చర్చలు జరుపుతారు.
బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ.. మొబైల్స్లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్మిషన్ తరహాలోనే డీ2ఎం టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 ఎంహెచ్జడ్ బాండ్ను డీ2ఎంలో వినియోగం కోసం కసరత్తు జరుగుతున్నది.
ప్రస్తుతం దేశంలో 21-22 కోట్ల కుటుంబాలకు టీవీలు ఉన్నాయి. 80 కోట్ల మందికి పైగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 2026 నాటికి మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా.. ఈ పరిస్థితుల్లో మరింత మందికి టీవీ కంటెంట్ పంపాలంటే అతిపెద్ద వేదికగా మొబైల్ ఫోన్లు నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. డీ2ఎం ద్వారా ప్రజలకు అత్యవసర సర్వీసులు, విద్యాబోధన కార్యక్రమాలను బోధించాలని కేంద్రం తలపోస్తున్నది.
గత జూన్లో దేశంలో 5జీ సేవలు, డైరెక్ట్ 2 మొబైల్ బ్రాడ్ కాస్టింగ్ కలగలిపేందుకు ఐఐటీ-కాన్పూర్ ఒక వైట్ పేపర్ ప్రచురించింది. డీ2ఎం నెట్ వర్క్ ద్వారా డేటా డ్రైవెన్ యాప్స్ సాయంతో ప్రాంతీయ టీవీ చానెళ్లు, రేడియో చానెళ్లకు ఎడ్యుకేషనల్ కంటెంట్, ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్, విపత్తుల సమాచారం అందజేయొచ్చునని ఈ వైట్ పేపర్ ప్రకటించింది. అయితే డీ2ఎం పాలసీకి కట్టుబడితే టెలిఫోన్ ఆపరేటర్ల డెటా రెవెన్యూలో 80 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై టెలికం ఆపరేటర్లు నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయని సమాచారం.