Tour Packages | న్యూఢిల్లీ, మార్చి 18: విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మరింత సొమ్ముతో రెడీ అవ్వండి. ఈ జూలై 1 నుంచి ఫారిన్ టూర్ ప్యాకేజీల బుకింగ్కు మీరు ఇంకింత చెల్లించాల్సి ఉంటుంది మరి. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం (ఎల్ఆర్ఎస్) కింద ఫారిన్ రెమిటెన్సుల కోసం మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్) రేటును బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఏకంగా 20 శాతానికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఇది 5 శాతమే. దీంతో విద్య, వైద్య అవసరాల నిమిత్తం కాకుండా విదేశాలకు వెళ్లేవారు 15 శాతం అదనంగా టీసీఎస్ను చెల్లించాల్సి వస్తున్నది.
జూలై మొదలు ఎవరైనా ట్రావెల్ ఏజెంట్ నుంచి విదేశీ టూర్ ప్యాకేజీని మీరు కొన్నైట్టెతే 20 శాతం టీసీఎస్ తప్పదు. చివరకు మీ విదేశీయానం కోసం ఓ ఆథరైజ్డ్ డీలర్ నుంచి వ్యక్తిగతంగా ఫారిన్ కరెన్సీని కొన్నప్పటికీ అదనపు టీసీఎస్ భారాన్ని మోయాల్సిందే. ఉదాహరణకు యూరప్కు వెళ్లాలనుకునే ఓ కుటుంబం ప్యాకేజీ ధర రూ.10 లక్షలుగా ఉందనుకుంటే.. ట్రావెల్ ఏజెంట్కు ఇప్పుడైతే రూ.10.5 లక్షలిస్తే సరిపోతుంది. జూలై 1 నుంచి రూ.12 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. జీఎస్టీ, ఇతరత్రా చార్జీలు ఉండనే ఉంటాయి. ఇక ట్రావెల్ ఏజెంట్ మీ పాన్ నెంబర్ కిందే ఈ టీసీఎస్ సొమ్మును డిపాజిట్ చేస్తారు.
టూర్ ప్యాకేజీలో భాగంగా కాకుండా మీ విదేశీ విమాన టిక్కెట్టును ట్రావెల్ ఏజెంట్లతో సంబంధం లేకుండా మీరే సొంతంగా బుక్ చేసుకుంటే మాత్రం టీసీఎస్ వర్తించదు. అలాగే పూర్తి టూర్ ప్యాకేజీకి బదులుగా విమాన టిక్కెట్లు, హోటల్స్, సైట్సీయింగ్ వంటి వాటి బుకింగ్స్ను వేర్వేరుగా చేసుకోవడం వల్ల కూడా టీసీఎస్ భారాన్ని తప్పించుకోవచ్చు. ఇక హోటల్ బుకింగ్ తదితర చెల్లింపుల కోసం మీ క్రెడిట్ కార్డును వాడుకోవడం ఉత్తమం.
వసతి, ఆహార సౌకర్యాలతోపాటు విదేశాల్లో ఇతరత్రా ప్రయాణ ఖర్చులన్నీ టీసీఎస్తో ప్రభావితమవుతున్నాయి. విమాన చార్జీలపై మాత్రం ఈ ప్రభావం పడట్లేదు.
-సుదర్శన్ మోత్వానీ, బుక్మైఫారెక్స్.కామ్ వ్యవస్థాపక సీఈవో
ఈ ప్రతిపాదన భారతీయ విదేశీ పర్యాటకులపై ప్రభావం చూపేలా ఉన్నది. ముఖ్యంగా ఫారిన్ టూర్ ప్యాకేజీలపై ఆధారపడేవారి బడ్జెట్ 15% పెరుగుతున్నది.
-సుమిత్ మంగళ్, లుత్రా అండ్ లుత్రా లా ఆఫీసెస్ ఇండియా