2000 Note | న్యూఢిల్లీ, నవంబర్ 2: రూ.2వేల నోట్ల మార్పిడిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలకు గొప్ప ఆఫర్ను ప్రకటించింది. ఈ నోట్లున్నవారు వాటిని ఇన్సూర్డ్ పోస్టులో సూచించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపితే అక్కడ మార్చి అంతే విలువైన ఇతర కరెన్సీ నోట్లను వారివారి ఖాతాల్లో తామే జమ చేస్తామని కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. అలాగే ట్రిపుల్ లాక్ రిసిప్టాకిల్ (టీఎల్ఆర్) ఫామ్ సౌకర్యాన్నీ కల్పించింది.
ఇన్సూర్డ్ పోస్ట్, టీఎల్ఆర్ ఫామ్తో అత్యంత భద్రంగా రూ.2వేల నోట్లను ప్రజలు మార్చుకోవచ్చని ఆర్బీఐ రిజినల్ డైరెక్టర్ రోహిత్ పీ దాస్ తెలిపారు. ఆర్బీఐ రీజినల్ ఆఫీసులకు దూరంగా ఉన్నవారి సహాయార్థమే ఈ అవకాశం కల్పించినట్టు చెప్పారు. దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చులు కలిసొస్తాయన్నది. అంతేగాక క్యూలైన్లలో నిలబడే బాధా తప్పుతుందని అన్నారు. ఈ ఏడాది మే 19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ అనూహ్యంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే వీటిని బ్యాంకుల్లో, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకునేందుకూ అవకాశం కల్పించింది. తొలుత సెప్టెంబర్ 30దాకా గడువు ఇవ్వగా, ఆ తర్వాత దాన్ని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అక్టోబర్ 8 నుంచి హైదరాబాద్సహా ఆర్బీఐకి చెందిన 19 ఆఫీసుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పోస్టల్ సౌకర్యాన్ని తెచ్చింది. ఈసారైతే గడువులేమీ లేవు. 2016 నవంబర్లో పాత రూ.500, రూ.1,000 నోట్లను మోదీ సర్కారు రద్దు చేసిన నేపథ్యంలో తొలిసారిగా ఈ రూ.2,000 నోట్లను ఆర్బీఐ పరిచయం చేసిన సంగతి విదితమే.
ఓ ఇనిస్టిట్యూట్ కావాలి
ఆయా రంగాల్లోని రెగ్యులేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఓ ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన రాజేశ్వర్రావు అన్నారు. దీనివల్ల మెరుగైన ఫలితాల్ని సాధించవచ్చని గురువారం ఇక్కడ జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ఏయే పరిస్థితుల్లో ఎలా? వ్యవహరించాలన్న దానిపై ఈ ఇనిస్టిట్యూట్ ద్వారా రెగ్యులేటర్లకు మరింత పట్టు లభిస్తుందని చెప్పారు. ఇక డాటా భద్రత విషయంలో ఆర్థిక సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచార గోప్యతను గౌరవించాలని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందన్నారు.