Yes Bank Scam | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం అవినాశ్ ఎన్ భోసలే అనే అబిల్ గ్రూప్ ప్రమోటర్ను అరెస్ట్ చేసింది. ముంబై, పుణె నగరాల్లో రియాల్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థగా అబిల్ నిలిచింది. ముంబైలో అతడ్ని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేశామని సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం ముంబైలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరిందని సమాచారం.
శివసేన నాయకుడు – మహారాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్కు చెందిన ఇండ్లు, ఆఫీసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడి చేసిన నాడే అవినాశ్ ఎన్ భోసలేను సీబీఐ అరెస్ట్ చేయడం గమనార్హం. అవినాశ్ ఎన్ భోసలేకు పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని సమాచారం. అవినాశ్పై సీబీఐతోపాటు ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నది.
గతేడాది పలు దఫాలు అవినాశ్ భోసలే, ఆయన కొడుకు అమిత్ భోసలేలను ఈడీ ప్రశ్నించింది. ఫెమా కింద గతేడాది మార్చిలో భోసలే కుటుంబానికి చెందిన రూ.40 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. పుణె పోలీసులు నమోదు చేసిన హవాలా కేసు ప్రకారం తదుపరి రూ.4 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంది.
గత నెల 30న ముంబై, పుణెల్లో రియాల్టీ రంగంలో షాహిద్ బాల్వా, వినోద్ గోయెంకా, అవినాశ్ భోసలేలతోపాటు పలువురు కీలకంగా వ్యవహరించిన ప్రముఖుల ఇండ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇటీవలే రేడియస్ డెవలపర్స్కు చెందిన సంజయ్ ఛాబ్రియాను అరెస్ట్ చేసింది. అంతకుముందు ఫిబ్రవరిలో రేడియస్ డెవలపర్స్కు చెందిన ఆరు చోట్ల తనిఖీలు జరిపింది.