Xiaomi 14 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ 14 సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. మార్చి ఏడో తేదీన భారత్ మార్కెట్లో వీటిని ఆవిష్కరించనున్నది. కాగా, జర్మనీ కెమెరా తయారీ సంస్థ లైకా భాగస్వామ్యంతో షియోమీ 14 ఆల్ట్రా ఫోన్లో క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. షియోమీ 14 ఫోన్ మాత్రం ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. షియోమీ 14 సిరీస్ ఫోన్లలో ఏఐ ఆధారిత అప్లికేషన్లు ఉంటాయి. దీనివట్ల కాన్ఫరెన్సుల నుంచి రియల్ టైం ట్రాన్స్స్క్రిప్షన్లు పొందొచ్చు.
సోమవారం నుంచి బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో షియోమీ తన షియోమీ 14 సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించడం ఆసక్తికర పరిణామం. గ్లోబల్ మార్కెట్లో షియోమీకి మూడో స్థానం ఉంది. 2023లో ఆపిల్ 20.1 శాతం, శాంసంగ్ 19.4 శాతం, షియోమీ 12.5 శాతం మార్కెట్ వాటా ఉందని ఐడీసీ అంచనా వేసింది. షియోమీ 14 సిరీస్ ఫోన్లతోపాటు షియోమీ స్మార్ట్ బాండ్ 8 ప్రో, షియోమీ వాచ్ ఎస్3, షియోమీ వాచ్ 2 తదితరాలను కూడా ఆవిష్కరించింది.