హైదరాబాద్, నవంబర్ 18: రికార్డు స్థాయికి చేరుకున్న మసాలదినుసుల ధరలు వచ్చే త్రైమాసికం నాటికి తగ్గే అవకాశం ఉన్నదని వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రామ్కుమార్ మీనన్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న ది వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ సదస్సును ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనవరి-మార్చి త్రైమాసికం నాటికి కొత్త పంట రానుండటంతో మసాల దినుసుల ధరలు దిగిరావచ్చునన్నారు.
వర్షాభావ పరిస్థితులు, దిగుమతులు తగ్గిపోవడంతో గత ఆరు నెలలుగా మసాలదినుసుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని, కానీ ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే ప్రస్తుతం 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మసాలదినుసుల ఎగుమతులు 2030 నాటికి 10 బిలియన్ డాలర్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న మసాలదినుసుల్లో 85 శాతం ఇక్కడే వినియోగిస్తుండగా, కేవలం 15 శాతం మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.