న్యూఢిల్లీ, జూన్ 7: అధిక ద్రవ్యోల్బణం, సరఫరా అవరోధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగిస్తుందని, దీంతో వృద్ధి రేటు అంచనాల్ని తగ్గిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత్ ఆర్థికాభివృద్ధి 7.5 శాతానికి కుదించింది. వృద్ధి అంచనాల్లో ప్రపంచ బ్యాంక్ కోత విధించడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన బ్యాంక్ ఏప్రిల్ నెలలో 8 శాతానికి దించింది. ప్రస్తుతం దీనిని 7.5 శాతానికి తగ్గించింది. 2023-24 నుంచి వృద్ధి మరింతగా 7.1 శాతానికి తగ్గుతుందని, దీర్ఘకాలంపాటు ఇదేస్థాయిలో భారత్ వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్పై తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో వివరించింది. ప్రైవేట్ రంగం నుంచి వస్తున్న స్థిర పెట్టుబడులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, ప్రోత్సాహకాలు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది.
ప్రథమార్ధంలో మందగమనం
కొవిడ్ కేసులు పెరగడంతో పలు రాష్ర్టాల్లో నియంత్రణలు విధించడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలతో 2022 ప్రధమార్థంలో భారత్ వృద్ధి మందగించిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో రికవరీకి ఆటంకం ఏర్పడుతుందన్నది. నిరుద్యోగం రేటు కొవిడ్ ముందస్తుస్థాయికి తగ్గినప్పటికీ, కార్మికుల ఉత్పాదకత కొవిడ్ ముందస్తుస్థాయికంటే తక్కువగానే ఉన్నదని, తక్కువ వేతనాలు లభించే ఉద్యోగాలకు కార్మికులు మళ్ళారని తెలిపింది.
2.9 శాతానికి ప్రపంచ ఆర్థికాభివృద్ధి
గత ఏడాది 5.7 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థికాభివృద్ధి ఈ సంవత్సరం 2.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన 4.1 శాతం అంచనాతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటును బ్యాంక్ భారీగా తగ్గించింది. పలు సంక్షోభాల తర్వాత నిబంధనలతో కూడిన విధాన వాతావరణం ఏర్పడి, వృద్ధి జోరందుకోవడంపైనే దీర్ఘకాలిక అవకాశాలు ఆధారపడి ఉంటాయని మల్పాస్ తన రిపోర్ట్ ముందుమాటలో వివరించారు. ఉక్రెయిన్లో యుద్ధం నిలిచిపోతే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి , ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడానికి ప్రపంచ బ్యాంక్ గ్రూప్తో సహా ఇతర దేశాలు తగిన చర్యల్ని రెట్టింపు చేస్తాయని పేర్కొన్నారు.