పాజెక్టులకు 20 నెలలు దూరం
హైదరాబాద్, డిసెంబర్ 10: రాంకీపై ప్రపంచ బ్యాంక్ గ్రూప్ వేటు వేసింది. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ సేవల సంస్థ రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ (రీల్)ను 20 నెలలు డిబార్ చేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఈ 20 నెలలు ప్రపంచ బ్యాంక్ నిధులతో జరిగే పనులు, ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా బహిష్కరించింది. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓ పారిశ్రామిక కాలుష్య నిర్వహణ ప్రాజెక్టుకు సంబంధించి రీల్ మోసాలకు పాల్పడిందంటూ ఆక్షేపిస్తూ ప్రపంచ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. రీల్ ఎండీ ఎం గౌతమ్ రెడ్డికీ ఈ నిషేధం వర్తిస్తుందని తాజా ప్రకటనలో వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఏపీలోని ఉక్కయ్యపల్లి వద్దనున్న మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డంప్సైట్ మూసివేత, నియంత్రణ కాంట్రాక్టు బిడ్డింగ్ 2014లో జరిగింది. ఇందులో సబ్కాంట్రాక్ట్ విషయాన్ని రాంకీ తమకు తెలియపర్చలేదని ప్రపంచ బ్యాంక్ అంటున్నది. సబ్కాంట్రాక్ట్ పనులకు ముందు అనుమతి కూడా పొందలేదని, పైగా ఈ మొత్తం వ్యవహారం గురించి 2017లో తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని బ్యాంక్ పేర్కొన్నది. వరల్డ్ బ్యాంక్ ప్రొక్యూర్మెంట్ మార్గదర్శకాల ప్రకారం దీన్ని మోసంగా పరిగణిస్తున్నామన్నది.