World Bank on India | భారత్ వృద్ధిరేటు అంచనాల్లో ప్రపంచ బ్యాంక్ కోత విధించింది. ఇంతకుముందు 8.7 శాతం జీడీపీ నమోదవుతుందని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ధరలు పెరిగిపోవడంతోపాటు సరుకుల సరఫరాలో అడ్డంకులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
కొవిడ్-19, పెరిగిన ధరల వల్ల లేబర్ మార్కెట్ కోలుకోలేదని, తదనుగుణంగా గృహ వినియోగం స్తంభించిపోయిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల అధిక ముడి చమురు ధరలు, పెరిగిన ఆహార ధాన్యాల రేట్లతో ప్రజల వాస్తవ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపాయని ప్రపంచబ్యాంక్ దక్షిణాసియా ఉపాధ్యక్షుడు హార్ట్విగ్ స్కాఫర్ తెలిపారు.
ఇంతకుముందు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) మాత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2023-24లో 8 శాతానికి వృద్ధి చెందుతుందని పేర్కొంది. కానీ చైనాలో వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4.8 శాతానికి పడిపోతుందని వివరించింది.