హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మహిళలు ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండాలని రాష్ట్ర హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్ వీఎస్ అలుగు వర్షిణి అన్నారు. మహిళల సాధికారత కోసం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలకు ఎఫ్టీసీసీఐ మరింత చేరువ కావాలని, జిల్లాల్లో బలమైన పునాదులు నిర్మించుకోవాలని సూచించారు. ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ మహిళల జీవనోపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు జీవనోపాధి కార్యక్రమాలు దోహద పడతాయని ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ చైర్మన్ భగవతీ దేవి అన్నారు. అనంతరం 15 మంది మహిళలకు పీకో మెషీన్లు పంపిణీ చేశారు.