Cyber Fraud | సైబర్ మోసగాళ్లు రోజుకో రూట్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్ లైన్లో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లకు ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక మహిళ స్విగ్గీ అకౌంట్ను హ్యాక్ చేసి, ఆమెను మభ్య పెట్టి రూ.రూ.97,197 కాజేశారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అనికేత్ కెర్లా (25), హిమాన్షు కుమార్ (23) అనే సైబర్ నేరగాళ్లు.. 26 ఏండ్ల మహిళ స్విగ్గీ ఖాతా (లేజీ పే) ను హ్యాక్ చేశారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) అనే టెక్నాలజీ సాయంతోఆ మహిళకు కాల్ చేసి తాము స్విగ్గీ అధికారులం అని, మీ బ్యాంకు ఖాతా హ్యాక్ అయిందని నమ్మించారు. గుర్తు తెలియని వారు మీ ఖాతా యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తు్న్నారని, అలా జరక్కుండా ఉండాలంటే ఖాతా వివరాలు చెప్పాల్సి ఉంటుందన్నారు.
దీంతో నిజంగానే తన ఖాతా ప్రమాదంలో పడిందని భావించిన ఆ మహిళ తన ఖాతా వివరాలు.. యూజర్ నేమ్, పాస్ వర్డ్ వెల్లడించారు. ఆ వెంటనే కెర్లా, హిమాన్షులు ఆమె స్విగ్గీ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకుని ఆమె ఖాతా నుంచి రూ.రూ.97,197 మాయం చేశారు. దీంతో అప్రమత్తమైన సదరు మహిళ తన స్విగ్గీ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంతకుముందు స్విగ్గీ, జొమాటోల్లో కెర్లా డెలివరీ బాయ్గా పని చేశాడు. ఆన్ లైన్లో ఆర్డర్ చేసే వారి సమాచారం సేకరించాడు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పంజాబ్ లోని హిమాన్షుతో జత కలిశాడు. అటుపై వారిద్దరూ అమాయకులను బురిడీ కొట్టించి మనీ దోచుకుంటున్నారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.