హైదరాబాద్, జనవరి 19 (బిజినెస్ డెస్క్): డాటా లోకలైజేషన్తో దేశంలో డాటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటున్నది. అయితే ఈ డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పుడు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తున్నది. తాజాగా గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో మరో మూడు డాటా సెంటర్లను రూ.16 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ఇప్పటికే గత ఏడాది రూ.16 వేల కోట్లతో మూడు డాటా సెంటర్లను తెస్తామని ఈ సంస్థ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ల సంఖ్య 6కు చేరుతున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలూ హైదరాబాద్నే తమ స్మార్ట్ డాటా సెంటర్గా ఎంచుకుంటున్నాయంటే ఇక్కడి డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. కాగా, దేశంలో డాటా సెంటర్ పాలసీని తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే. డాటా సెంటర్లను ప్రత్యేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో పెట్టారు. భవన అనుమతులుసహా వీటి శైలి, నిర్మాణానికి సంబంధించి నిర్ధిష్ట ప్రమాణాలనూ రూపొందించారు.