న్యూఢిల్లీ, జూలై 15: విప్రో జూన్ క్వార్టర్లో అనూహ్యమైన పనితీరును ప్రదర్శించింది. విశ్లేషకుల అంచనాల్ని మించుతూ విప్రో నికరలాభం 35.6 శాతం పెరిగి రూ.3,242.6 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో రూ.2,390 కోట్ల లాభాన్ని ఆర్జించింది.2021 జూన్తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 22.3 శాతం వృద్ధితో రూ.14,913 కోట్ల నుంచి రూ.18,252 కోట్లకు పెరిగినట్లు గురువారం కంపెనీ ప్రకటించింది. దేశంలో మూడో పెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ అయిన విప్రో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి గైడెన్స్ను సైతం పెంచింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఐటీ సర్వీసుల ఆదాయం 2,535 మిలియన్ డాలర్ల నుంచి 2,583 మిలియన్ డాలర్లు ఉండవచ్చని గైడెన్స్ ప్రకటించింది.
ఈ ఏడాది 30,000 మందికి ఆఫర్ లెటర్స్ పంపిస్తామని, వారు 2023 ఆర్థిక సంవత్సరంలో జాయిన్కావాల్సివుంటుందని విప్రో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతేడాదికంటే 33 శాతం అధికంగా రిక్రూట్ చేసుకుంటామని కూడా కంపెనీ తెలిపింది.