న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.3,074.50 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2021-22 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, రూ.12 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.445 చొప్పున 26.96 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.
నగదు నిల్వలు అధికంగా ఉండటంతో సంస్థ ఈ బైబ్యాక్ ప్రతిపాదను తెరపైకి తీసుకొచ్చింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను కంపెనీ రూ.23,190.3 కోట్ల ఆదాయాన్ని గడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.17 శాతం అధికమం. పనితీరును మెరుగుపరిచే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు విప్రో సీఎఫ్వో జతిన్ దలాల్ తెలిపారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.90,487.6 కోట్ల ఆదాయంపై రూ. 11,350 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ఐటీ సేవల ద్వారా సంస్థకు 2,823 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది.
ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం 2,753-2,811 మిలియన్ డాలర్ల స్థాయి లో ఉంటుందని అంచనా వేస్తున్నది.
జనవరి-మార్చిలో 4.1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నది.
మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర రూ.374.90 వద్ద ముగిసింది.
‘2022-23లో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాం. క్లయింట్లకు నమ్మకం కలగడం వల్లనే అతి పెద్ద ఒప్పందాలు జరిగాయి’
– థిర్రీ డెలాపోర్ట్, విప్రో సీఈవో, ఎండీ