ముంబై, అక్టోబర్ 14: క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా తీసుకునే ఫ్రెషర్ల కోసం ఐదేండ్ల శాలరీ ప్లాన్ను విప్రో అమలు చేస్తున్నది. ఇందులో వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్లుసహా మొత్తం వారికిచ్చే జీతం తీరుతెన్నులు ఉంటాయని ఈ దేశీయ నాల్గో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ చెప్తున్నది. ‘మా సంస్థలోకి వచ్చే ఫ్రెషర్ల కెరీర్, జీతాలకు సంబంధించి ఓ స్పష్టమైన ఐదేండ్ల ప్రణాళికను మేము రూపొందించాం. వారికిచ్చే ఆఫర్ లెటర్లలో ఈ సమాచారాన్ని ఇస్తున్నాం. రాబోయే ఐదేండ్లలో జీతభత్యాలు ఎలా ఉంటాయి?, బోనస్లు, హైక్ల వివరాలన్నీ ముందే చెప్తున్నాం’ అని విప్రో ప్రధాన మానవ వనరుల అధికారి సౌరభ్ గోవిల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
క్యాంపస్ రిక్రూట్లే కీలకం
దేశీయ ఐటీ రంగ సంస్థల్లో చాలా వరకు కొత్తగా తీసుకునే ఉద్యోగులను క్యాంపస్ నియామకాల ద్వారానే ఎంచుకుంటున్నాయి. విప్రో సైతం ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో దాదాపు 15వేల మందిని క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారానే తీసుకున్నది. అలాగే సంస్థ ఉద్యోగుల్లో సుమారు 85 శాతం మంది 100 శాతం వేరియబుల్ పే కాంపోనెంట్ను పొందడం విశేషం. మరోవైపు మూన్లైటర్స్ (రహస్యంగా మరో ఉద్యోగం చేస్తున్నవారు)పై విప్రో కొరడా ఝళిపిస్తున్నది. వీరిని గుర్తించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్న స్టార్టప్ సేవలనూ వినియోగించుకుంటున్నది. ఉద్యోగుల పీఎఫ్ వివరాలను కూడా క్రాస్చెకింగ్ చేస్తున్నామని గోవిల్ ఈ సందర్భంగా తెలిపారు.