న్యూఢిల్లీ, జూన్ 3: వచ్చేవారంలో సమావేశం కానున్న రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లను మరో 40 బేసిస్ పాయింట్లు పెంచుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్ అంచనా వేసింది. అటుతర్వాత ఆగస్టు సమీక్షలో ఇంకో 0.35 శాతం పెంచుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ జూన్ సమావేశంలో 0.50 శాతం పెంచినట్టయితే, ఆగస్టులో పెంపు 0.25 శాతమే ఉండవచ్చని, మొత్తంమీద వచ్చే రెండు సమీక్షల్లో 0.75 శాతం మేర రెపో రేటు పెంపుదల ఉంటుందని బొఫా వివరించింది. జూన్ మీట్లో రేట్లు పెంచనున్నట్టు ఇప్పటికే రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.
టమోటో ధరలు భారీగా పెరగడంతో మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.1 శాతంగా నమోదు కావొచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. ఇంధన ఉత్పత్తులపై ఎక్సయిజు సుంకం తగ్గింపు, సోయాబీన్, సన్ఫ్లవర్ వంటనూనెలపై దిగుమతి సుంకాల్ని ఎత్తివేయడం, ఏటీఎఫ్ ధరల్ని తగ్గించడం వంటి చర్యలు..ద్రవ్యోల్బణం స్పీడ్కు కళ్ళెం వేస్తాయని బొఫా పేర్కొంది. అయినప్పటికీ 2022-28 ఆర్థిక సంవత్సరంలో సగటు వినియోగ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంటుందని, ఇది ఆర్బీఐ నిర్దేశిత పరిమితి 6 శాతంకంటే చాలా ఎక్కువేనని, దీంతో జూన్లో 0.40 శాతం, ఆగస్టులో 0.35 శాతం చొప్పున రేట్లు పెంచుతుందని అంచనా వేస్తున్నట్టు వివరించింది. లేదా 0.50+0.25 కాంబినేషన్లో సైతం రేట్లు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నది. ఆగస్టుకల్లా రెపో రేటును కొవిడ్ ముందస్తు స్థాయి 5.15 శాతానికి ఆర్బీఐ తీసుకెళుతుందని, అటుతర్వాత కూడా ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి వడ్డీ రేటు 5.65 శాతానికి పెరుగుతుందని బొఫా విడుదల చేసిన రిపోర్ట్ అంచనా వేసింది.
క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను ఆర్బీఐ మరో 0.50 శాతం పెంచుతుందని బొఫా పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి లిక్విడిటీని తగ్గించే లక్ష్యంతో ఈ తగ్గింపు ఉంటుందన్నది. మే 4న ఆర్బీఐ సీఆర్ఆర్ను 0.50 శాతం పెంచింది. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.4 శాతంగా నమోదుకావొచ్చని బొఫా అంచనా వేసింది.