Gold Rate | భారతీయులు.. మరీ ప్రత్యేకించి మహిళలకు బంగారం.. బంగారం ఆభరణాలన్నా ఎంతో ఇష్టం. ప్రతి పండుగ.. పెండ్లి నుంచి ప్రతి కుటుంబ వేడుక కోసం వీలైతే కాసింత బంగారం కొంటారు.. తమ కూతుళ్ల భవిష్యత్ అవసరాల కోసం కొద్ది కొద్దిగా కూడబెడుతుంటారు. ధంతేరాస్.. అక్షయ తృతీయ పర్వదినాల సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం వల్ల తమ కుటుంబ సంపద పెరుగుతుందని నమ్ముతారు. ఇక వేడుకల్లో ఆభరణాలు ధరించడానికి తహతహలాడుతుంటారు. గత రెండు దశాబ్దాలుగా ధర `బంగార`మంటూ పైపైకి దూసుకెళ్తున్నది. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) రూ.61,040 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో అత్యధికంగా రూ.61,530 పలికింది.
మొన్న అక్షయ తృతీయ వేళ తులం బంగారం ధర చెన్నైలో రూ.61,150, హైదరాబాద్లో రూ.60,820 వద్ద ట్రేడయింది. అధిక ధరల వల్ల కొనుగోళ్లు తగ్గాయని బులియన్ వ్యాపారులు స్వయంగా చెబుతున్నారు. సంప్రదాయంగా బంగారం కొనుగోళ్లు కొనసాగాయే గానీ, ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లకు గిరాకీ లేదని బులియన్ వర్గాలు తెలిపాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అక్షయ తృతీయ నాటికి తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.70 వేల నుంచి రూ.72 వేలకు చేరుతుందని భావిస్తున్నారు.
బంగారం కేవలం ఆభరణాల తయారీకి మాత్రమే కాక.. ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్గా కూడా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మార్కెట్లో పరిస్థితులు, అంతర్జాతీయ అనిశ్చితి, ఆర్థిక రంగంలో సంక్షోభం, క్రూడాయిల్ ధరల్లో ఒడిదొడుకులు ఉన్నా.. ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే గతేడాది అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా ఇన్వెస్టర్లకు బంగారంపై రిటర్న్స్ అంత పెద్దగా లేవని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా డాలర్ బలోపేతం కావడం, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలే దీనికి కారణం అంటున్నారు.
గతేడాదితో పోలిస్తే అంతర్జాతీయంగా ఈ ఏడాది బంగారంపై పెట్టుబడుల మీద రిటర్న్స్ బాగానే ఉన్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 7.5 శాతం, స్పాట్ గోల్డ్ 8 శాతం రిటర్న్స్ లభించాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.60 వేల మార్క్ దాటి పలుకుతున్నది. బంగారం ధర బుల్లిష్గా ఉందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది వరకు రూ.70 వేల మార్క్కు చేరువ కావచ్చునని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. గతేడాది తమ అంచనాలకు అనుగుణంగా బంగారం ధర దాదాపు 14.3 శాతం పెరిగిందని బులియన్ వ్యాపారులు అంటున్నారు.
`వచ్చే అక్షయ తృతీయ నాటికి తులం (పది గ్రాములు) బంగారం (24 క్యారట్లు) ధర రూ.68 వేల మార్క్ను దాటిపోవచ్చు. రూ.57,000-58,000 మధ్యకు పడిపోవచ్చు` అని ఏంజిల్ వన్ అనే సంస్థ తన అక్షయ తృతీయపై రూపొందించిన బంగారం స్పెషల్ రిపోర్ట్లో పేర్కొంది. తులం బంగారం (24 క్యారట్లు) ధర దేశీయంగా రూ.68,000-68,500, అంతర్జాతీయ మార్కెట్లో 2270-2290 డాలర్ల మధ్య తచ్చాడుతుండవచ్చు. ఒకవేళ పెరిగితే దేశీయంగా రూ.72,200, అంతర్జాతీయ మార్కెట్లో 2410 డాలర్లు పలుకుతుందని బులియన్ మార్కెట్ వర్గాల అంచనా.
`మాంద్యం నేపథ్యంలో మరికొంత కాలం అధిక వడ్డీరేట్లు కొనసాగవచ్చు. బ్యాంకుల సంక్షోభం, డాలర్ ఇండెక్స్ పతనం వంటి అంశాలు పెట్టుబడిపి బంగారం స్వర్గధామం కావచ్చు. దీని ప్రభావం బంగారం ధరపై పడుతుంది. మధ్య కాలిక వ్యవధి, దీర్ఘ కాలిక వ్యవధిలో బంగారం ధర తులం రూ.65 వేల మార్క్ను చేరుతుంది` అని యాక్సిస్ సెక్యూరిటీస్ హెచ్ఎన్ఐ & ఎన్నారై అక్విజిషన్స్, కమొడిటీస్ హెడ్ ప్రీతం పట్నాయక్ చెప్పారు.
`అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు రెండు శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం మరో 25 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచవచ్చు. ఈ నిర్ణయం డాలర్ ఇండెక్స్పై సానుకూల ప్రభావం పడితే బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉండొచ్చు. సర్దుబాట్లు చోటు చేసుకుంటే దీర్ఘకాలికంగా బంగారంపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. రూ.65 వేలు, అంతకంటే తక్కువ ధర ఉన్నప్పుడు కొనుగోలు చేయడం, గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు` ప్రీతం పట్నాయక్ తెలిపారు.