Reliance-Disney | రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ డిస్నీ విలీనం చర్చలు దాదాపు పూర్తి కావచ్చాయి. దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ సేవలందిస్తున్న రిలయన్స్ అనుబంధ వయాకాం, వాల్ట్ డిస్నీ అనుబంధ డిస్నీ ఇండియా విలీనం త్వరలో పూర్తి కానున్నది. విలీనం పూర్తయిన తర్వాత ఏర్పడే సంస్థలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్కు 51 శాతం, డిస్నీ ఇండియాకు 49 శాతం ఉంటుందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. రిలయన్స్ అనుబంధ వయాకాం 18 అనుబంధ సంస్థగా సదరు విలీన సంస్థ ఉంటుందని తెలుస్తున్నది.
యాజమాన్య వాటా కింద డిస్నీ ఇండియాకు రిలయన్స్ కొంత నగదు చెల్లించనున్నదని సమాచారం. విలీన సంస్థ బోర్డులో రెండు సంస్థలకు సమాన వాటా ఉంటుందని భావిస్తున్నాయి. ఇక వయాకాం 18లో అతి పెద్ద ఇన్వెస్టర్ ‘బోధి ట్రీ’కి కూడా బోర్డులో చోటు దక్కుతుందని తెలుస్తోంది. వచ్చే నెలాఖరు నాటికి విలీన ప్రక్రియ ఓ కొలిక్కి రానున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం స్టార్ ఇండియా సంస్థ 77 చానెళ్లు నడుపుతుండగా, వయాకాం 18.. 38 చానెళ్లు నిర్వహిస్తున్నది. డిస్నీకి డిస్నీ+ హాట్ స్టార్, రిలయన్స్కు జియో సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఉన్నాయి. అయితే విలీనంపై ఇరు సంస్థల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.