న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అంతర్జాతీయ మందగమనం నడుమ దేశీ ఆర్థికాభివృద్ధిని సంరక్షిస్తూనే ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం తమ ప్రధాన లక్ష్యమని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాల్ని మనం చూస్తున్నాం.
ఈ ప్రభావం భారత్పై తక్కువగా ఉండేలా మేము చూస్తాం’ అని దాస్ వ్యాఖ్యానించారు. జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆర్బీ ఐ అంచనా 16.2 శాతానికంటే తక్కువగా వెలువడిన నేపథ్యంలో దాస్ ఒక ఆంగ్లచానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జీడీపీ డాటాను విశ్లేషించి, వచ్చే పాలసీ ప్రకటనలో తగిన చర్యలు తీసుకుంటాం‘ అన్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ఠస్థాయిని చూసిందని, వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది 5 శాతానికి దిగివస్తుందని అంచనా వేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్ల పెంపుదలలో ఆర్బీఐ వెనుకబడి లేదన్నారు.