ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల షేర్లన్నీ శుక్రవారం కుప్పకూలాయి. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్లో తమ సంస్థ విలీనానికి కిషోర్ బియానీ చేసుకున్న ఒప్పందంపై ముందుకు వెళ్లొద్దని గురువారం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.
దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ గ్రూపు షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ఫ్యూచర్ రిటైల్ రికార్డు స్థాయిలో పతనాన్ని నమోదు చేసింది. దాదాపు 11 శాతం కుప్పకూలి లోయర్ సర్క్యూట్ అయింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దారుణంగా పడిపోయి రూ. 3,029 కోట్లకు పడిపోయింది.
ఫ్యూచర్ రిటైల్ గ్రూపులో. ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో 9.15 శాతం పడిపోగా, ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ 8.95 శాతం , ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపు 10 శాతం, ఫ్యూచర్ సప్లయి చైన్ సొల్యూషన్స్ షేర్లు 4.99 శాతం పడిపోయాయి. గడువులోగా అన్ని రెగ్యులేటరీ ఆమోదాలను పొందడంలో ఫ్యూచర్ రిటైల్ విఫలమైతే, రిలయన్స్ ఈ ఒప్పందానికి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.