Bhavish Aggarwal | దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థలు హీరో మోటో కార్ప్, బజాజ్ మోటార్ సైకిల్స్పై ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాల ఐసీఈ (ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్) వాహనాల తయారీకి.. ఆయా సంస్థలతో హీరో మోటో కార్ప్, బజాజ్ మోటార్ సైకిల్స్ కాంట్రాక్టు ఒప్పందాలు ఖరారు చేసుకున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ను భారత్ మార్కెట్లో హీరో మోటో కార్ప్ ఆవిష్కరించింది. మరోవైపు బజాజ్ మోటార్ సైకిల్స్-ట్రయంఫ్ భాగస్వామ్యంతో ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ తీసుకొచ్చింది.
దీనిపై ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఘాటుగా స్పందించారు. ‘పాశ్చాత్య దేశాల ఐసీఈ మోటార్ సైకిల్ బ్రాండ్స్ బైక్లను దేశీయంగా కొన్ని కంపెనీలు ఎందుకు తయారు చేస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచం మొత్తానికి అవసరమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను #మేక్ ఇన్ ఇండియా కింద ఫ్యూచర్ మోటారు సైకిళ్లను నిర్మిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
బజాజ్-ట్రయంఫ్ సంయుక్తంగా దేశీయ మార్కెట్లో విడుదల చేసిన బ్రిటన్ టూ వీలర్స్ బైక్ ‘ట్రయంఫ్ స్పీడ్ 400’ ధర రూ.2.23 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ప్రకటించింది. తొలి పది వేల బైక్ లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని ప్రకటించింది.
మరోవైపు అమెరికా మోటారు సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యంతో హీరో మోటో కార్ప్ ఆవిష్కరించిన హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ.2.29 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.