న్యూఢిల్లీ, జూన్ 14: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 15.88 శాతంగా నమోదైనట్టు మంగళవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఎగిసిన ముడి చమురు ధరలు, ఎగబాకిన కూరగాయలు, పండ్ల ధరలు హోల్సేల్ రేట్లను ఎగదోస్తున్నాయని ఓ ప్రకటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. నిజానికి టోకు ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది మూడో నెల. అంతేగాక నిరుడు ఏప్రిల్ నుంచి రెండంకెల స్థాయిలోనే కదలాడుతుండటం గమనార్హం. మినరల్ ఆయిల్స్, ముడి పెట్రోలియం-సహజ వాయువు, ఆహారోత్పత్తులు, ఆహారేతర ఉత్పత్తులు, రసాయనాల ధరలు పెరగడం టోకు ద్రవ్యోల్బణాన్ని పెంచాయి.