Budget 2022 | ప్రతియేటా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెడుతుంటారు.. బడ్జెట్లో ముఖ్యాంశాలపై స్పీచ్ కూడా ఉంటుంది. ఆయా మంత్రుల వ్యవహారశైలి.. బడ్జెట్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యేకతలు సంతరించుకున్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రసంగాల్లో ఆమెదే అతిపెద్ద రికార్డు. 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది.
విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తన రెండో బడ్జెట్ స్పీచ్ 2020 ఫిబ్రవరి 1న 11 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం 1.40 గంటలైనా అంటే దాదాపు 160 నిమిషాలు కొనసాగింది. ఇంకా రెండు పేజీల స్పీచ్ మిగిలే ఉంది.. ఆమె అసౌకర్యం (uneasy ) గా ఫీలవుతున్నారు. నుదుటిపై వస్తున్న చెమట బిందువులను తుడిచేస్తూనే ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె సహచర మంత్రులు క్యాండీలు ఆఫర్ చేశారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని మిగతా బడ్జెట్ స్పీచ్ ప్రసంగించినట్లు భావిస్తున్నట్లు ప్రకటించారు. భారత దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద బడ్జెట్ స్పీచ్గా పరిగణిస్తున్నారు. అంతే కాదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగం టైం రికార్డు.. అంటే తన సొంత రికార్డునే బ్రేక్ చేశారు.
అంతకుముందు 2003-04 ఆర్థిక సంవత్సరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ 2.17 గంటలు ప్రసంగించారు. జస్వంత్ సింగ్ బడ్జెట్ స్పీచ్ను 2019-20లో నిర్మలా సీతారామన్ దాటేశారు. ఇక బడ్జెట్ స్పీచ్లో వాడిన పదాల్లో నిర్మలా సీతారామన్ స్పీచ్ (2020-21) మూడో స్థానంలో ఉంది. సంస్కరణల మాంత్రికుడు-దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గం చూపిన మన్మోహన్ సింగ్ 1991-92 ఆర్థిక సంవత్సరానికి తన తొలి బడ్జెట్ ప్రసంగం 18,650 పదాలు. ఇదే స్వాతంత్ర భారతావని బడ్జెట్ ప్రసంగాల్లో అత్యంత ముఖ్యమైంది. తర్వాతీ స్థానంలో నరేంద్రమోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ స్పీచ్ 18,604 పదాలు.