WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించి ఇన్స్టంట్ మల్టీ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకుపైగా జనం వాట్సాప్ను వినియోగిస్తున్నారు. భారత్లో దాదాపు 56కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 2019లో మెటా కంపెనీ 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ను కొనుగోలు చేసింది. ఇంతకు ముందు 2012లో కంపెనీ ఇన్స్టాగ్రామ్ను సైతం టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా కంపెనీ ప్రకటనల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. అయితే, కంపెనీ ప్రస్తుతం వాట్సాప్పై కన్నేసి.. దాని నుంచి ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నది. ఇందుకోసం భారత్, బ్రెజిల్లో పేయిడ్ సర్వీసులను తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది. అయితే, సాధారణ యూజర్లకు కాదని, ఈ పేయిడ్ సర్వీసులు వాట్సాప్ బిజినెస్ యూజర్లకు మాత్రమే. వాట్సాప్ బిజినెస్ యూజర్లు యాప్ ద్వారా చాట్ చేస్తే డబ్బులు చెల్లించాల్సి రానున్నది.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. వాట్సాప్ యాప్ నుంచి కస్టమర్లతో చాట్ చేసేందుకు కంపెనీల నుంచి ఒక్కో సందేశానికి దాదాపు 40 పైసల వరకు వసూలు చేయనున్నట్లు తెలుస్తున్నది. దేశంలోని చాలా కంపెనీలు ప్రస్తుతం కస్టమర్లతో వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవుతున్నాయి. తమ ఉత్పత్తులు, బ్రాండ్స్కు సంబంధించి వినియోగదారులతో పంచుకుంటున్నాయి. ఈ క్రమంలో వాట్సాప్ భారత్ అతిపెద్ద మార్కెట్గా భావిస్తున్నది. భారత్లో చాలా మంది ఊబర్ సహా పలు కంపెనీలకు చెందిన క్యాబ్స్ను సైతం వాట్సాప్ను వినియోగిస్తున్నారు. అలాగే, బ్యాంకులు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, బ్రోకరేజ్ కంపెనీలు, తదితర సంస్థలన్నీ తమ కస్టమర్లతో తమ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను వాట్సాప్ ద్వారా వివరిస్తుంటాయి. అయితే, ఈ క్రమంలో దీన్ని లాభాసాటిగా మార్చుకునేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నది. భారత్లో 50కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వాట్సాప్కు ఉన్నారు. ఓ నివేదిక ప్రకారం.. వాట్సాప్కు ఆదాయం తీసుకువచ్చేందుకు 90 మందితో ప్రత్యేకంగా టీమ్ను మెటా కంపెనీ ఏర్పాటు చేసింది. అయితే, ఇందులో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సైతం ఉండడం విశేషం.