WhatsApp | గతంలో మెసేజ్ పంపాలంటే ఎస్ఎంఎస్లు.. లేదంటే ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం మార్పిడి చేసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్.. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లు వచ్చిన తర్వాత సమాచారం మార్పిడి తేలికవుతూ వచ్చింది. తాజాగా వాట్సాప్లో సుదీర్ఘ సందేశం పంపాలంటే ఆడియో వాయిస్ సందేశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయినా కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్ నోట్ అందగానే వెంటనే అది ప్లే చేసి వినలేని పరిస్థితులు ఉంటాయి. దీనికి పరిష్కారం కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ సిద్ధం చేస్తున్నదని వాబీటా ఇన్ఫో తెలిపింది.
వాయిస్ నోట్ ట్రాన్స్ స్క్రిప్షన్ పేరుతో వాట్సాప్ కొత్త ఫీచర్ డిజైన్ చేస్తున్నది. దీని సాయంతో వాయిస్ మెసేజ్లను టెక్ట్స్గా మార్చుకోవచ్చు. ఫలితంగా నోట్ వినకుండానే మెసేజ్ చదివి తిరిగి రిప్లయ్ ఇవ్వవచ్చు. ఇప్పటికే కొందరు ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ లభిస్తుంది. కొత్త ఫీచర్ కోసం యూజర్లు అదనంగా 150 ఎంబీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. వాయిస్ నోట్స్ టెక్ట్స్ లోకి మార్చడానికి డివైజ్ స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్లను వాట్సాప్ వాడుకోవడంతో ట్రాన్స్స్క్రిప్షన్ డివైజ్లోనే జరుగుతుందని, యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాబీటా ఇన్ఫో పేర్కొంది.