Facebook platforms down | సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గంట సేపటి నుంచి అంతరాయం ఏర్పడింది. యూజర్లు వాటి సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇతర సోషల్ మీడియా వేదికల నుంచి ఫిర్యాదు చేస్తున్నారు. ఫేస్బుక్ ఆధ్వర్యంలోని ఈ మూడు యాప్స్.. వాట్సాప్.. ఫేస్బుక్.. ఇన్స్టాగ్రామ్ కొన్ని నిముషాలుగా పని చేయడం లేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
దీనిపై ఫేస్బుక్ యాజమాన్యం రియాక్టయింది. అంతరాయం కలిగినందుకు క్షమించండి.. ఏదో తప్పు దొర్లింది. దాన్ని సరి చేయడానికి కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తాం అని ఫేస్బుక్ వెబ్సైట్లో మెసేజ్ పోస్ట్ చేసింది.
రాత్రి 9 గంటలకు ఫేస్బుక్ ఆధీనంలోని యాప్స్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు యూజర్లు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. వెబ్ సేవల ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ డాట్ కామ్.. 20 వేల మందికి పైగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు నివేదించారని పేర్కొంది. భారత్లో ఫేస్బుక్కు 41 కోట్ల మందికి పైగా, వాట్సాప్కు 53 కోట్లు, ఇన్స్టాగ్రామ్కు 21 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.
9.02 గంటల నుంచి వాట్సాప్.. ఫేస్బుక్.. ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం కలిగింది. ఫేస్బుక్ వెబ్సైట్ తమ మూడు సోషల్ నెట్వర్కింగ్ యాప్ సేవలను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. దాదాపు మూడు గంటలుగా వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగింది.
దీనికి కారణాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇది హ్యాకర్స్ పనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సాంకేతిక కారణాల వల్లే నిలిచిపోయి ఉండొచ్చునని చెబుతున్నారు. ఈ మూడు నెట్వర్కింగ్ యాప్ల సేవల్లో అంతరాయంపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మీమ్స్ వదులుతున్నారు.