(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు బయటపెట్టిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ నెట్వర్క్. వ్యవస్థీకృత నేరాలు, అవినీతి, ఆర్థిక అవకతవకలకు సంబంధించి లోతైన విశ్లేషణలు చేయడానికి జర్నలిస్టులు డ్రూ సులీవన్, పౌల్ రాడూ ఇద్దరు కలిసి 2006లో దీన్ని ఏర్పాటుచేశారు. ఆరు ఖండాల్లో 50కి పైగా మీడియా ఔట్లెట్లతో సంబంధాలు కలిగివున్నారు. రష్యా చరిత్రలోనే అతిపెద్ద ట్యాక్స్ ఫ్రాడ్గా చెప్పుకొనే మ్యాగ్నిట్స్కై, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పనామా పేపర్స్, భారత్తో సహా 30 దేశాల ఎన్నికలను ప్రభావితం చేసిన టీమ్ జార్జ్ తదితర హైప్రొఫైల్ కేసుల్లో ఓసీసీఆర్పీ అంచనాలే నిజమయ్యాయి. అందుకే, ఓసీసీఆర్పీలో ప్రముఖ అంతర్జాతీయ మదుపర్లు జార్జ్ సోరోస్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ వంటి వ్యాపార దిగ్గజాలు పెట్టుబడులు పెట్టారు.