ఆదాయం పన్ను (ఐటీ) చట్టంలో రూల్ 132ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పరిచయం చేసింది. గత నెల అక్టోబర్ 1న ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఈ నిబంధనపై కొంత అస్పష్టత, అనిశ్చితులు నెలకొన్నాయి. దీనిపై ఐటీ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.
రూల్ 132లో ఏమున్నది
ఆదాయం పన్నుకు వ్యాపారులు చేసిన సెస్సు/సర్చార్జీ చెల్లింపులు పన్ను కోతల కిందికి వస్తాయా?.. లేదా?.. అన్న సందిగ్ధత ఈ రూల్ 132 నేపథ్యంలో ఏర్పడుతున్నది. నిజానికి ఆదాయం పన్నుపై వేసిన సెస్సు/సర్చార్జీల వంటి వాటికి పన్నుసహిత లాభం నుంచి మినహాయింపునివ్వరాదనే ఈ నిబంధన చెప్తున్నది. అయినప్పటికీ పన్ను చెల్లింపుదారుల కోసం వన్-టైం విండోను సీబీడీటీ కల్పించింది. దీనిద్వారా సెస్సు/సర్చార్జీల వంటి వాటిని తీసేశాక వ్యాపారులు తమ పన్నుసహిత లాభాలను మరోసారి లెక్కించుకోవచ్చు.
ఏం చేయాలి
సెస్సు/సర్చార్జీల మినహాయింపును క్లెయిమ్ చేసుకున్న ట్యాక్స్పేయర్లు.. తమ పన్నుసహిత ఆదాయాన్ని, చెల్లించిన పన్ను, సెస్సు, సర్చార్జీల వివరాలను ఫామ్ 69 ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. దీని ఆధారంగా ఐటీ అధికారులు మరోసారి గణనను ప్రారంభిస్తారు. లాభించేలా ఫలితాలుంటే ఆపై ఫామ్ 70 ద్వారా ట్యాక్స్పేయర్లు తమ తదుపరి పన్ను చెల్లింపులను చేసుకోవచ్చు. ఈ చెల్లింపులపై ఎటువంటి జరిమానాలు కూడా ఉండవు.
ఎవరిపై ప్రభావం
వ్యాపారం, వృత్తి ఆధారిత పన్ను చెల్లింపుదారులకు రూల్ 132 ప్రతికూలం. గతంలో సెస్సు/సర్చార్జీ కోతను క్లెయిమ్ చేసుకున్నవారికీ ఇబ్బందే. మదుపరులంతా తమ ఆదాయాన్ని మరోసారి గణించాలని మదింపు అధికారిని స్వచ్ఛందంగా కోరాల్సి వస్తున్నది. పైగా అధిక ఆదాయం ఉన్నట్టు తేలితే వర్తించే పన్ను మొత్తాల్లో 50 శాతానికి సమానంగా జరిమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.