Work From Home | ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వర్క్ ఫ్రం హోం సంస్కృతి అమల్లోకి వచ్చింది. మూడు వేవ్ల ఉధృతి యావత్ దేశాన్ని తాకింది. దాదాపు దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావచ్చింది. 2021లో రెండో వేవ్ తర్వాత వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్) పాలసీ ఎత్తేద్దామనుకున్నాయి కార్పొరేట్ సంస్థలు. కానీ అంతలోనే మూడో వేవ్ దూసుకొచ్చిన దరిమిలా ఐటీ సంస్థలు సహా కార్పొరేట్లన్నీ వర్క్ ఫ్రం హోంపై సందిగ్ధతను కొనసాగిస్తూ వచ్చాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తుండగా, మరికొన్ని సంస్థలు విధాన నిర్ణయ దశలోనే ఉన్నాయి. వర్క్ ఫ్రం హోం లేదా వర్క్ ఫ్రం ఆఫీసుపై కార్పొరేట్ సంస్థలు 2 రకాల విధానాన్ని అవలంభిస్తున్నాయి. కొన్ని సంస్థలు వాటిల్లోని టీమ్ల విధాన నిర్ణయానికి వదిలేస్తున్నాయి. దాదాపు 50 శాతం సిబ్బందికి ఫ్లెక్సిబిలిటీ కల్పిస్తున్నాయి.
ప్రస్తుత ధోరణిపై ఇప్పటికిప్పుడు స్పందించడం తొందరపాటవుతుందని హెచ్ఆర్ నిపుణులు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు అంటున్నారు. ప్రస్తుతం నెల వారీగా, త్రైమాసికం వారీగా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం లేదా వర్క్ ఫ్రం ఆఫీసు ఫెసిలిటీ కల్పిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా కొన్ని కంపెనీలు తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు.
మైక్రోసాఫ్ట్, యాక్చెంజర్, డెల్లాయిట్, ఆర్పీజీ గ్రూప్ సంస్థల యాజమాన్యాల్లో విధాన నిర్ణయం వికేంద్రీకరణ అవుతున్నది. తమ సంస్థల్లో వర్క్ మోడల్పై ఆయా టీమ్ల నిర్ణయానికి వదిలేస్తున్నాయి. కంపెనీలు, వాటి హెచ్ఆర్ నిపుణులు కూడా సిబ్బంది ఫ్లెక్సిబిలిటీ, టీమ్ల సాధికారతకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బెటర్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా దీర్ఘకాలంలో ఉద్యోగుల జీవితాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునేందుకు మార్గం కల్పిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ ప్రతి ఒక్కరి నుంచి ఇన్పుట్స్ తీసుకుని సహకార ధొరణితో ముందుకెళుతున్నది. తరుచుగా మేనేజర్లు, టీమ్లు సంప్రదింపులు జరుపుకుని అవసరమైతే మార్పులు చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ హెచ్ఆర్ హెడ్ ఐరా గుప్తా చెప్పారు. అత్యధిక ఉద్యోగాల్లో మైక్రోసాఫ్ట్ 50 శాతం వర్కింగ్ ఫ్లెక్సిబిలిటీని ఆమోదిస్తున్నది.
హర్ష్ గోయెంకా సారధ్యంలోని ఆర్పీజీ గ్రూప్ తమ సిబ్బంది వర్క్ను బట్టి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కల్పిస్తున్నది. అందులోనూ 50 శాతం మంది వర్క్ ఫ్రం ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని క్యాటగిరీల వర్కర్లకు 100 శాతం వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పిస్తున్నది. ఐటీ దిగ్గజం యాక్స్చెంజర్ తమ సిబ్బంది వర్క్ లొకేషన్ను బట్టి ఎంపిక చేసుకునే వెసులుబాటునిస్తున్నది. ఇండివిడ్యుయల్ పార్టనర్స్, టీం లీడర్లు, మేనేజర్ల నిర్ణయాన్ని బట్టి.. సిబ్బందిని వర్క్ ఫ్రం ఆఫీసు సేవలందించాలని డెల్లాయిట్ ఆదేశిస్తున్నది.