ముంబై, అక్టోబర్ 10: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ భారతీయ అపర కుబేరుడిగా అవతరించారు. తాజాగా విడుదలైన 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ముకేశ్ సంపద రూ.8.08 లక్షల కోట్లుగా ఉన్నది. ఇదే సమయంలో గౌతమ్ అదానీ ఆస్తులు రూ.4.74 లక్షల కోట్లుగానే ఉన్నట్టు తేలింది. దీంతో మరోసారి దేశీయ ధనికుల్లో అగ్రస్థానం ముకేశ్కే దక్కింది. క్రిందటిసారి గౌతమ్ అదానీ టాప్లో ఉండగా, గడిచిన ఏడాది కాలంలో ఈయన సంపద ఏకంగా 57 శాతం కరిగిపోయినట్టు హురున్ పేర్కొన్నది.
ఫలితంగానే ముకేశ్ అంబానీ మళ్లీ టాప్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. నిజానికి ఈ ఏడాది కాలంలో ముకేశ్ సంపద పెరిగింది కేవలం 2 శాతమే. ఇక జాబితాలోని ధనికులందరి సంపద విలువ.. సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల ఉమ్మడి జీడీపీ కన్నా ఎక్కువగానే ఉండటం గమనార్హం.
హిండెన్బర్గ్ దెబ్బ
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రిసెర్చ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ సంపద భారీ ఎత్తున ఆవిరైపోయిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే అదానీ.. భారతీయ శ్రీమంతుల్లో ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చిందని హురున్ ఎండీ, చీఫ్ రిసెర్చర్ అనాస్ రహ్మాన్ జునైద్ చెప్పారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని, అందుకే స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీల షేర్లు అంతలా పెరిగాయని ఈ ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీంతో మార్కెట్లలో గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
దమానీ వెనుకంజ
సంపద సృష్టిలో ప్రముఖ రిటైల్ స్టోర్ డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ వెనుకబడ్డారు. గడిచిన ఏడాది కాలంలో దమానీ సంపద 18 శాతం క్షీణించినట్టు తాజా రిపోర్టులో తేలింది. ఈ క్రమంలోనే టాప్-10 సంపన్నుల్లో 3 ర్యాంకులను చేజార్చుకుని ఈసారి 8వ స్థానంలో స్థిరపడాల్సి వచ్చింది. ఇదిలావుంటే దేశంలో అసమానతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈసారి 51 మంది శ్రీమంతుల సంపద రెట్టింపైనట్టు హురున్ వెల్లడించింది. నిరుడు వీరి సంఖ్య 24గానే ఉన్నది. జాబితాలో జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వొహ్రా (20) యువ బిలియనీర్. కాగా, ఫాల్గుని నాయర్ను వెనక్కినెట్టి స్వయం శక్తితో ఎదిగిన భారతీయ సంపన్న మహిళల్లో ప్రథమ స్థానంలో రాధా వెంబు నిలిచారు.
94 ఏండ్ల వయసులో ప్రెసిషన్ వైర్స్ ఇండియా సంస్థకు చెందిన మహేంద్ర రతిలాల్ మెహెతా జాబితాలో స్థానం సంపాదించారు. రూ.3,000 కోట్ల సంపదతో ప్రైవేట్ ఈక్విటీ రంగం నుంచి హురున్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి వ్యక్తిగా కేదార క్యాపిటల్కు చెందిన మనీశ్ కేజ్రివాల్ నిలిచారు. నిరుడు జాబితాతో చూస్తే ఈసారి జాబితాలో బైజూస్ రవీంద్రన్సహా 55 మంది చోటు కోల్పోయారు.
తెలంగాణ నుంచి 95 మంది
తెలంగాణ రాష్ట్రంలో శ్రీమంతులు అంతకంతకు పెరుగుతున్నారు. తాజాగా హురున్ విడుదల చేసిన జాబితాలో రాష్ట్రం నుంచి 95 మందికి చోటు లభించింది. వీరిలో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 87 మంది ఉండటం విశేషం. దివీస్ ల్యాబ్ అధినేత మురళీ దివీస్ తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మందికి చోటు లభించింది. మరోవైపు, సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానం దక్కింది.