న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తమ గ్రూప్ సిమెంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని, దేశంలో అత్యంత లాభాదాయక సిమెంట్ ఉత్పత్తిదారుగా ఆవిర్భవిస్తామని బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. అంబూజా సిమెంట్స్, ఏసీసీల టేకోవర్ డీల్ పూర్తయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ భారత్లో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సిమెంట్కు డిమాండ్ పలు రెట్లు పెరుతుందని, దీంతో తమ లాభాల మార్జిన్లు విస్త్రతమవుతాయన్నారు. ప్రస్తుతం తమ సిమెంట్ ఉత్పాదక సామర్థ్యం 70 మిలియన్ టన్నులుకాగా, ఐదేండ్లలో 140 టన్నులకు పెంచాలని భావిస్తున్నామన్నారు.
యూరప్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్ నుంచి 6.5 బిలియన్ డాలర్లకు ఏసీసీ, అంబూజాల్ని కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ ఒక్క ఉదుటన దేశంలో రెండో పెద్ద సిమెంట్ తయారీదారుగా ఆవిర్భవించింది. ఈ టేకోవర్ చరిత్రాత్మకమని, దేశీ మౌలిక, మెటీరియల్స్ రంగంలో ఈ కొనుగోలు అతిపెద్దదని, దీనిని 4 నెలల రికార్డు సమయంలో పూర్తిచేశామని గౌతమ్ తెలిపారు. సిమెంట్ రంగంలో తాము ప్రవేశానికి కారణాల్ని వివరిస్తూ చైనాలో తలసరి సిమెంట్ వినియోగం 1600 కేజీలుకాగా, ఇండియాలో అతి 250 కేజీలేనని, దీని ప్రకారం 7 రెట్ల వృద్ధికి అవకాశం ఉన్నదన్నారు. సిమెంట్ డిమాండ్లో దీర్ఘకాలిక సగటు వృద్ధి జీడీపీకి 1.2 నుంచి 1.5 రెట్లు ఉంటుందని తాము అంచనా వేస్తున్నామన్నారు. దేశంలో హౌసింగ్, ఇన్ఫ్రా రంగాల్లో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఈ సందర్భంగా సిమెంట్ రంగం ఆకర్షణీయం కానున్నదన్నారు.